9, జులై 2016, శనివారం

‘దివ్యాగ్ని’ హృదయజ్యోతి

అబ్దుల్ కలాం గారికి తెలుగువారి కవితా నివాళిగా మద్రాస్ విశ్వవిద్యాలయం 'ఒక విజేత ' అనే పుస్తకాన్ని ప్రచురించింది. అందిలో అచ్చైన నా కవిత... మీ కోసం...

‘దివ్యాగ్ని’ హృదయజ్యోతి 
-------------------------
భావరాజు పద్మిని – 1/9/15.

ఎగురుతున్న చిట్టి పక్షిరెక్కల్ని, 
ఆశగా చుసాయా చిన్నారి కళ్ళు.
తనూ రెక్కలు కట్టుకుఎగరాలని, 
గాలిలోకి ఎగిరాయి అతని కాళ్ళు.

అందనంత ఎత్తుకు ఎదగాలంటే,
పేదరికానికి ఎదురొడ్డి పోరాడాలి,
ఉక్కులాంటి సంకల్పబలం కావాలి,
కష్టాలనుంచి శక్తిని మధించాలి,
అణువణువునూ తపన దహించాలి,
స్వీయశిల్పిగా వ్యక్తిత్వం దిద్దుకోవాలి,
మంచినే చూసుకుంటూ సాగిపోవాలి,
హృదయంలో నిజాయితీ ఉండాలి.



లోకం రువ్విన రాళ్ళతో సోపానాలు కట్టి,
‘శక్తై’న వ్యక్తి’ముందు ఓటమే ఓడిపోయింది,
ఏరోస్పేస్ ఇంజనీర్ గా అతన్ని మార్చింది.
‘రోహిణి’, ‘అగ్ని’, ‘పృథ్వి’ క్షిపణులు తీర్చిన,
భరతమాతకు తొలి క్షిపణి అందించిన,
అణ్వస్త్ర రాజ్యాలతో అమ్మను కూర్చోబెట్టిన, 
‘మిస్సైల్ మాన్‘ గా అతనికి పేరు తెచ్చింది.
‘రాష్ట్రపతి’గా జాతి ఆయన్ను గౌరవించింది.
అట్టడుగు నుంచి ఆకాశం వరకూ ఎదిగినా,
పసి హృదయాన్ని పదిలంగా కాపాడుకున్నారు,
కులమతాల హద్దులుదాటిన భారతీయుడయ్యారు,
నిస్వార్దుడిగా ఉండాలనే బ్రహ్మచారయ్యారు,
నిరాడంబరతకు నిలువెత్తు దర్పణమయ్యారు,
అధ్యాపకుడినేనంటూ అందరికీ చేరువయ్యారు,
మనసుల్ని మలిచే స్వదేశీ స్వాప్నికుడయ్యారు,
సహచరుడిగా మెలిగే ఆదర్శనాయకుడయ్యారు,
ఇతరులలోని శక్తిని వెలికి తీసిన స్రష్టయ్యారు.

సుతిమెత్తని హృదయజనితమైన కళాదృష్టి,
వాడిగల మేధోజనితమైన వైజ్ఞానిక దృష్టి,
మానవీయదృక్పధంతో మెలిగిన పరమేష్టి,
ఆయన జీవితమే ఒక గొప్ప సందేశంగా, 
ఆయన జీవితమే ఒక మహా గ్రంధంగా,
అందించి, దేశంకోసం పాటుపడమని చెప్తూ,
ప్రజలమదిలోని నిరంతర చైతన్య స్రవంతి,
ఏ అమరాలోకానికో తరలి వెళ్ళారు.

ఒక్క గుండెలో దీపం వెలిగిస్తే అది,
మరెన్నింటినో ఉద్దీపనం చేస్తుంది.
యువహృదయాల్లో ఈ ఆరని ఈ దివిటీ,
దిక్సూచిగా వారికి మార్గదర్శనం చేస్తూ, 
‘దివ్యాగ్ని’ హృదయజ్యోతిగా జ్వలిస్తూ,
కాలాన్ని జయించిన ‘కలాం’ గా మారి,
చరిత్ర పుటల్లో చిరాయువయ్యింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి