12, ఫిబ్రవరి 2015, గురువారం

ప్రకృతి ఒడిలోకి...

 ప్రకృతి ఒడిలోకి...
భావరాజు పద్మిని 

నునులేత భానుకిరణాలు, 
మబ్బుల మంచుముసుగు కరిగించే వేళ....

కరిగిన మంచు ముత్యాలు,
చెట్ల ఆకులపై చిరుసవ్వడి చేస్తూ జారే వేళ...

చినుకు స్పర్శ పులకలు,
పక్షుల కిలకిల రావాలై పల్లవించే వేళ....

కొండ లోయల్లో పక్షుల రావాలు,
కమ్మగా ప్రతిధ్వనిస్తూ మురిపించే వేళ....

పిల్లగాలి అలలపై తేలుతూ ,
ఔషధ సుగంధాలు తరలివచ్చే వేళ...



వింత పూవుల సోబగులేవో,
వర్ణాల తోరణాలు కట్టి స్వాగతించే వేళ...

మట్టి దారుల్లో, రాళ్ల బాటల్లో, 
అల్లుకున్న లతల్లో, అడవి చెట్లలో,
మనసు మురిసే  మధుర సడిలో,
ఆలోచనల అలజడిని శాంతపరచి,
ఎప్పుడైనా ....
ప్రకృతి ఒడిలోకి పయనిస్తే....

ఉదయరాగం హృదయరాగమై వ్యాపిస్తుంది,
అంతరంగం ఆనందతరంగాలలో తేలుతుంది, 
మౌన మునిలా ఆత్మ నాట్యమాడుతుంది,
ఆ అనుభూతి శాశ్వతంగా నిక్షిప్తమైపోతుంది.

(అహోబిలంలో 26/12/2013 ఉదయాన్నే పావన నృసింహుని దర్శనానికి అడవి దారుల్లో నడచినప్పుడు కలిగిన భావనలు... )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి